1

Breaking News

ట్రావెల్స్‌కే పెద్ద పండగ! travels


ట్రావెల్స్‌కే పెద్ద పండగ!
సంక్రాంతికి రెట్టింపు చార్జీలు
డిమాండ్ మేరకే అంటున్న నిర్వాహకులు
పండగ చేసుకుంటున్న ఆర్టీసీ
అదనంగా 50 శాతం వసూలు
అయినా, సరిపోవని రైళ్లు, బస్సులు
అదనపు రైళ్లు, బస్సులూ కిటకిటే

 సంక్రాంతి ఎవరికి 'పేద్ద పండగో' తెలుసా!? ఆర్టీసీకీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు! సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ 50 శాతం బాదుతుంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు రెట్టింపు బాదేస్తున్నారు. రైల్వేలు అదనపు రైళ్లు వేసినా.. ఆర్టీసీ అదనపు సర్వీసులు నడుపుతున్నా.. రాజధాని ఖాళీ అయిపోయే సంక్రాంతి రద్దీకి సరిపోవడం లేదు. డిమాండ్‌కు సరిపడ ప్రజా రవాణా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి.

దీంతో, ట్రావెల్స్ పండగ చేసుకుంటున్నాయి. రాజమండ్రికి సాధారణ రోజుల్లో రూ.700 టికెట్ ధర కాగా.. ప్రస్తుతం రూ.1400-1600 ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ముందుగానే రిజర్వేషన్ చేయించుకున్నా.. చార్జీ ఇదే! డిమాండ్‌ను బట్టే చార్జీలు పెంచామని సాయి కిరణ్ ట్రావెల్స్ యజమాని బ్రహ్మాజీ చెప్పారు. సాధారణ రోజుల్లో రూ.1500 ఉండేదని, ఇప్పుడు రూ.4000 వసూలు చేస్తున్నారని, సామాన్యులు ఈ చార్జీలు భరించలేరని విజయవాడ వెళుతున్న అనిల్, సుస్మిత దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా రాజధాని పల్లెకు పయనమవుతుండడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. రైళ్లలో కనీ సం కూర్చునేందుకు కూడా ఖాళీ లేకపోవడం విశేషం. ఇక, బుధ, గురువారాల్లో 700 వరకు స్పెషల్ బస్సులను నడిపిన ఆర్టీసీ.. శుక్రవారం వీటి సంఖ్యను రెట్టింపు చేసింది. శనివారం మరో 1250 బస్సులు, ఆదివారం ఇంకో 850 స్పెషల్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. అయినా, బస్సులు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నా యి. సాధారణ చార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు.

No comments