1

Breaking News

కాలంతోపాటు సినిమా మాటల్లో చాలా మార్పులొచ్చాయి

 మూగ సినిమా మాటలు నేర్వడమే సినిమా చరిత్రలో  పెద్ద ముందడుగు. ఆ తర్వాత మాటల మూటలు అనేక రకాలుగా మారిపోయాయి. కాలంతోపాటు సినిమా మాటల్లో చాలా మార్పులొచ్చాయి, వస్తూనే ఉన్నాయి. వందేళ్ల తెలుగు సినిమా సంభాషణలపై ప్రత్యేక కథనం

 మాట మారింది, చిలుక పలుకులు కాస్తా... ఉతికి ఆరేసే పంచ్ డైలాగులయ్యాయి. ముక్తసరిగా ముగించే సంభాషణలు... చాంతాడంత పెరిగిపోయాయి, మళ్లీ కొన్నాళ్లుగా కుదించుకు పోతున్నాయి. పౌరాణికాలయినా, జానపదాలయినా.. సాంఘికాలయినా సినిమాకి మాటలే ప్రాణం. అసలు అలాంటి మాటలు సినిమాల్లోకి ఎలా వచ్చాయి, ఎలా మారాయి, ఎలా మారబోతున్నాయి.

తొలి భారతీయ సినిమా రాజా హరిశ్చంద్ర అయితే.. తెలుగు వారు నిర్మించిన తొలి సినిమా భీష్మ ప్రతిజ్ఞ. మాటలు లేని మూగ సినిమా అయినా భీష్మ ప్రతిజ్ఞని తెలుగు సినిమాగానే గుర్తిస్తాం. ఆ తర్వాత అచ్చ తెలుగు సంభాషణలతో విడుదలైన తొలితెలుగు టాకీ భక్త ప్రహ్లాద. హెచ్.ఎం.రెడ్డి తీసిన ఈ సినిమాలో మాటలు, పద్యాలు, పాటలు అన్నీ ఉన్నాయి. ఈ మాటలకీ, పాటలకీ మూలం సురభి నాటక సమాజం. అప్పటి వరకూ నాటక రూపంలో వచ్చిన సంభాషణలనే సినిమాలో కూడా వాడుకున్నారు. తర్వాతి కాలంలో సినిమాలకోసం ప్రత్యేక సాంకేతిక వర్గం తయారైంది. తొలితరం తెలుగు సినిమా మాటల రచయితల్లో ఒకరు బజిలేపల్లి లక్ష్మీకాంతం. లవకుశ, హరిశ్చంద్ర, అనసూయ, మళ్లీపెళ్లి, బాలనాగమ్మ... తదితర చిత్రాలకు లక్ష్మీకాంతం మాటలు రాశారు. మరికొన్ని సినిమాలకు పాటలు కూడా రాసిన ఈయన.. నటుడిగా కూడా మెప్పించారు.

ప్రముఖ రచయిత తాపీధర్మారావు మాలపిల్ల సినిమాకు మాటలు రాశారు. ఆ తర్వాత వచ్చినవారిలో పింగళి నాగేంద్రరావు అగ్రగణ్యులు. తెలుగు సినిమా మాటలకి కొత్త ఒరవడి నేర్పించారు పింగళి. కొత్తపదాలు సృష్టించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

పింగళి అద్భుత రచనకి తార్కాణం పాతాళ భైరవి సినిమా. భేతాళ మాంత్రికుడు, డింగరీ వంటి పాత్రలకు.... ఊతపదాల్ని సృష్టించి తెలుగు ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకున్నారు. అప్పటి వరకూ లేని కొత్త ఆనవాయితీ ప్రారంభించారు. సన్నివేశాలతోపాటు.. కేవలం మాటలకి కూడా పగలబడి నవ్వేలా రచన చేశారు పింగళి. మాటలతోపాటు.. కొన్ని సినిమాలకు పాటలు, చిత్రానువాదం సమకూర్చారు పింగళి.

తెలుగు సినిమా తొలితరం రచయితల్లో సముద్రాల రాఘవాచార్య ముఖ్యులు. 1937లో వచ్చిన కనకతారతో సినీ ప్రస్థానం ప్రారంభించి వందకు పైగా సినిమాలకు సముద్రాల మాటలు, పాటలు రాశారు. పౌరాణికం, సాంఘికం, జానపదం... కథ ఎలాంటిదైనా సముద్రాల మాటలు అలవోకగా సాగిపోయేవి. తెలుగు సినిమా మాటల రచయితల్లో సముద్రాలది ప్రత్యేక శైలి.

పౌరాణిక సినిమాల్లో కూడా... వాడుక పదాలనే మాటలుగా రాశారు సముద్రాల. చిత్ర పరిశ్రమలో తిరుగులేని రచయితగా పేరుతెచ్చుకున్నారు. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం వంటి ఆణిముత్యాలన్నిటికీ సముద్రాల మాటల రచయితగా పనిచేశారు.

తొలితరం రచయితల్లో మరపురాని సంభాషణలు పలికించిన మరో వ్యక్తి వెంపటి సదాశివబ్రహ్మం. తెనాలి రామకృష్ణతో మొదలుకొని.. సువర్ణ సుందరి, అప్పుచేసి పప్పుకూడు, ఇల్లరికం వంటి విజయవంతమైన సినిమాలకు... వెంపటి మాటలందించారు.

 తెలుగు సినిమా చరిత్రలో తరాలు మారేకొద్దీ కొత్తగా వచ్చిన మాటల రచయితలు పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చారు. మూస ధోరణికి పూర్తిగా దూరంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతుల్ని మిగిల్చారు. సినిమా మాటల్నే జనాలకు అలవాటు చేశారు. చక్రపాణి, డి.వి.నరసరాజు, దాసరి... తరానికొకరు తమ కలంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు.

తెలుగు సినిమా బహుముఖ ప్రజ్ఞాశాలి చక్రపాణి. దర్శకుడు, నిర్మాత, రచయితగా.. అన్ని శాఖలనీ సమర్థంగా నిర్వహించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రచయిత అన్ని పనులూ చేయగలడని నిరూపించారు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే సినిమాలు చేశారు చక్రపాణి.

నిన్నటి తరంలో తిరుగులేని పేరు సంపాదించిన మాటల రచయిత డి.వి.నరసరాజు. సాంఘికాలు జోరందుకున్న తర్వాత చిత్రసీమలోకి వచ్చిన నరసరాజు.. సామాన్య ప్రేక్షకులను గిలిగింతలు పెట్టే మాటలతో ఆకట్టుకున్నారు.

ఆపాత మధురాలకే కాదు, తర్వాత వచ్చిన పూర్తిస్థాయి సాంఘిక చిత్రాలకి కూడా నరసరాజు పదుణైన సంభాషణలు పలికించారు. కాలంతోపాటే మారారు, సినిమా మాటల్ని కూడా మార్చారు. యమగోల, యుగంధర్ వంటి సినిమాలకు కొత్త తరహా మాటలు రాసి మెప్పించారు.

తర్వాతి కాలంలో ఆస్థాయిలో మెప్పించిన రచయిత దాసరి నారాయణ రావు. దర్శకుడు, రచయిత, నిర్మాత... అన్నిరంగాల్లోనూ రాణించి మెప్పించారు. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటారు. దర్శకుల్లోనే సంచలన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు.

దర్శకుడిగా దాసరి విజయాలన్నిటిలో ఆయన సంభాషణల పాత్ర ఎక్కువ. అప్పటి వరకూ వస్తున్న సినిమాలకి భిన్నంగా... మామూలు మాటల్లో దాసరి విప్లవాన్నే తీసుకొచ్చారు. భావోద్వేగాలు పలికించే సన్నివేశాలయినా, గంభీరమైన సన్నివేశాలయినా.. దాసరి కలం కదంతొక్కేది

తెలుగు సినిమా చరిత్రలో తమ ప్రత్యేకత చాటుకున్న రచయితల్లో ముళ్లపూడి వెంకట రమణ ఒకరు. వాడుక మాటల్ని సినిమా మాటలుగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో రమణ అగ్రగణ్యులు. బాపు దర్శకత్వం, రమణ రచన కలిసి ఎన్నో ఆణిముత్యాలు తెలుగు సినమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

రచనా దర్శకత్వంలో తనకు తానే సాటి జంధ్యాల. హాస్య చిత్రాల ప్రత్యేక దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జంధ్యాల... సన్నివేశాలకు తగ్గట్టుగా మాటలతో నవ్వించి ఆకట్టుకున్నారు. కేవలం డైలాగులతోటే ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన దర్శకరచయిత జంధ్యాల.

నేటితరం దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీజగన్నాథ్... వంటి దర్శకులు పదునైన సంభాషణలతో ఆకట్టుకుంటున్నారు. ఈ తరం ప్రేక్షకుల్ని మైమరపించే స్థాయిలో మాటలు రాసి కనికట్టు చేస్తున్నారు. సినిమా కథ, కథనం, నిర్మాణ విలువల్లో మార్పులొస్తున్నట్టే.. కాలంతోపాటు తెలుగు సినిమా మాట కూడా పూర్తిగా మారిపోతోంది.


 తెలుగు పరిశ్రమలో ఎన్ని కొత్త కొత్త సినిమాలొచ్చినా... పౌరాణికాలు, జానపదాల్లో వచ్చిన డైలాగులు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆనాటి నటీనటులంతా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తమ హావభావాలతో, డైలాగులతో మెప్పించారు. రచయితల గొప్పదనం ఎంతున్నా... తెరపై ఆ డైలాగుల్ని పలికించి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నారు హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.

మాటలు నేర్చిన తెలుగు సినిమాకి పాటలు, పద్యాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. పౌరాణికాలు, జానపదాల కాలంలో మాటలు, పద్యాలే సినిమాకి ప్రాణాధార మయ్యాయి. రచయితల ప్రతిభతో పాటు... నటీనటుల హావభావాలతో సన్నివేశాలు వేటికవే సాటిగా నిలిచాయి.

తెలుగు పౌరాణికాల్లో సన్నివేశాలకంటే పాటలు, పద్యాలకుండే నిడివే ఎక్కువ. కొన్ని సార్లు పద్యాలు, పాటలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

సాంఘికాల కాలం వచ్చే సరికి తన మాటల్లోని ప్రత్యేక స్టైల్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. మాటల్లో నాటకీయత పలికించి మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

పౌరాణికాల్లో అయినా, సాంఘిక చిత్రాల్లో అయినా.. డైలాగుల్లో హీరోలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు పోటీపడ్డారు. తమదైన హావభావాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

డైలాగులు చెప్పడంలో తెలుగు హీరోల్లో ఒక్కొకరిదీ ఒక్కో స్టైల్. భారీ డైలాగులు చెప్పినా, పంచ్ డైలాగులు విసిరినా.. అభిమానుల్ని ఆకట్టుకోడానికే హీరోలంతా ప్రయత్నించారు.

కృష్ణంరాజు, శోభన్ బాబు, మోహన్ బాబు... హీరోలంతా కొన్నాళ్లపాటు డైలాగులతో మెప్పించే ప్రయత్నం చేశారు. హీరో క్యారెక్టర్ కి తగ్గట్టు.. దర్శకులు డైలాగులు రాశారు, దానికి తగ్గట్టే.. మాటలతో అభిమానుల్ని అలరించారు స్టార్ హీరోలు.


మూగ సైగల నుంచి.. గలగలా మాట్లాడే దశకి వచ్చిన తెలుగు సినిమా మళ్లీ ముక్తసరిగా మాట్లాడే స్టేజ్ లోకి వస్తోంది. పేజీలకొద్దీ చెప్పే డైలాగులకంటే... సింగిల్ లైన్ డైలాగులే ఫేమస్ అవుతున్నాయి. రచయితలంతా మాటల్లో మరీ పొదుపు పాటిస్తున్నారు. సంభాషణలకంటే సన్నివేశంలోనే సినిమా అర్థాన్ని చెప్పేస్తున్నారు. ఒక్క తెలుగు సినిమానే కాదు... వందేళ్లలో తమిళ, హిందీ పరిశ్రమలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.

తెలులో సింగిల్ లైన్ డైలాగుల్ని బాగా ఫేమస్ చేసిన హీరో చిరంజీవి. సినిమాకో స్టైల్లో డైలాగులు చెబుతూ.. తెలుగు తెరపై రఫ్ఫాడించాడు మెగాస్టార్.
వన్ లైన్ డైలాగులు బాగా ఫేమస్ అవడంతో... ప్రతి సినిమాలో ప్రతి సన్నివేశంలో ఇవి కామన్ అయిపోయాయి. గతంలో సినిమా విడుదలకి ముందు ప్రచారం కేవలం పాటల రూపంలో జరిగేది.. ఇప్పుడు పాటలకి తోడు పంచ్ డైలాగుల్ని విడుదలే చేస్తూ సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఫైట్లు, పాటలతోపాటు... మాస్ ఆడియన్స్ ని మెప్పించాలంటే పంచ్ డైలాగ్స్ తప్పనిసరి. ట్రెండ్ కి తగ్గట్టే... మాస్ హీరోలంతా సినిమా సినిమాకీ డైలాగులతో విరుచుకు పడుతున్నారు.

తెలుగు సినిమాకంటే ముందే మాటలు నేర్చిన హిందీ చిత్ర పరిశ్రమ కూడా కాలానికి తగ్గట్టే పాటల్లో, మాటల్లో కొత్త పోకడలు పోతోంది. గుల్జార్ వంటి రచయితలు.. కాలంతోపాటే మారుతూ ఇప్పటికే తమ హవా చూపిస్తున్నారు. కొత్తతరం దర్శకులంతా తమసినిమాలకు తామా మాటలు రాసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈతరంలో రాజ్ కుమార్ హిరాణి, మధుర్ భండార్కర్, ఇంతియాజ్ అలీ... వంటి దర్శకులు చిన్నచిన్న మాటలతో పెద్ద భావాలను పలికిస్తున్నారు. హిందీతోపాటు... వందేళ్ల తమిళ్ సినిమా కూడా మాటల్లో పెను మార్పులే చవిచూసింది. కేవలం స్టైల్స్, డైలాగులతోటే... రజనీకాంత్ సూపర్ స్టార్ గా మారాడు. మొత్తం దక్షిణాదిలోనే డైలాగ్ కింగ్ అనిపించుకుంటున్నాడు.

తెలుగులో ఈతరం హీలు, దర్శకులు... పంచ్ డైలాగులకోసం కష్టపడుతున్నారు. హీరో ఇమేజ్ కి తగ్గట్టే... పూరీ, శ్రీనువైట్ల డైలాగులు రాసుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా మొత్తం పంచ్ డైలాగులతో నింపేస్తున్నాడు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్... హీరోలంతా డైలాగులతో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు.

No comments