1

Breaking News

తెలంగాణపై తుది నిర్ణయం

 'తెలంగాణపై అటో ఇటో' అనే మాట మరోమారు వినిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం 'తుది నిర్ణయం' దిశగా కదులుతోందనే వాదన ఊపందుకుంటోంది. ఆ నిర్ణయం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. నిన్నటి వరకూ ప్యాకేజీ గురించి చెప్పిన వారే... ఇప్పుడు అధిష్ఠానం మనసు మార్చుకుందని, తెలంగాణ ప్రకటించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలును కలిపి 'రాయల తెలంగాణ' ప్రకటించవచ్చునని కొందరు... హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా తెలంగాణను ప్రకటించవచ్చునని మరికొందరు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294. తెలంగాణలోని 119 స్థానాలు ఉన్నాయి. వీటికి కర్నూలు (14), అనంతపురం జిల్లా (14) కలిపితే... 147 అవుతాయి. అంటే... ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా సగం స్థానాలను విభజించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్లవుతుంది. "రాయల్ తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి... అది ఆమోదం పొందితే రాష్ట్రం ఇవ్వాలి'' అని మొన్నటిదాకా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న గులాంనబీ ఆజాద్ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన పేర్కొంటున్నట్లు తెలిసింది. అయితే... రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆజాద్ హయాం ముగిసింది.

ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వచ్చారు. తెలంగాణపై తీర్మానం అంటేనే మెలిక! రాయల్ తెలంగాణ అనేది మరో మెలిక! మరి... వీటిపై దిగ్విజయ్ మనసులో ఏముందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తానికి ఈ నెలాఖరులోపే అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటుందని మాత్రం అంతా చెబుతున్నారు. ఈ నెల 30న కాంగ్రెస్ తెలంగాణ నేతలు హైదరాబాద్‌లో బహిరంగ ఏర్పాటు చేసిన నేపథ్యంలో... ఈలోపు ఒక ప్రకటన రావచ్చనే అంచనాలు వస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ నుంచి కూడా టీ-నేతలకు సానుకూల సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. 'సానుకూల నిర్ణయం వింటారు' అని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌తో దిగ్విజయ్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆలస్యమైందని, త్వరలోనే తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రులు డీకే అరుణ, జె.గీతారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిలతో డిగ్గీరాజా పేర్కొన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చాక మరింత సవివరంగా మాట్లాడదామని సూచించారు. మరోవైపు.. 'తెలంగాణ అనుకూల నిర్ణయం వస్తుందేమో' అనే అనుమానం, ఆందోళనను సీమాంధ్ర నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ మొదలైన నేతలు దీనిపై మంతనాలు జరుపుతున్నారు.


ఢిల్లీలో కిరణ్ చర్చలు..
కాంగ్రెస్‌లో తెలంగాణపై హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్న సమయంలోనే... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ రావడ ంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన తన శ్రేయోభిలాషి, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంను కలుసుకున్నారు. రాత్రి 8.45 గంటల ప్రాంతంలో దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. డిగ్గీరాజా రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత కిరణ్ ఆయనను కలుసుకోవడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దిగ్విజయ్‌కు కిరణ్ వివరించారు. ఇదే సమయంలో తెలంగాణపై పార్టీ అధిష్ఠానం వైఖరిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కిరణ్ సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కూడా కలిశారు.

మరోవైపు... కేంద్ర మంత్రి చిరంజీవి కూడా అంతకుముందు దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితి వివరించడం గమనార్హం. మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దిగ్విజయ్‌ను కలుసుకుని ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారని వివరించినట్లు తెలిసింది. లగడపాటి రాజగోపాల్, కేవీపీ కూడా దిగ్విజయ్‌తో సమాలోచనలు జరిపారు. సీఎం బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని, కొందరు పార్టీ నేతలను కలుసుకోనున్నారు. మొత్తానికి... తెలంగాణకు సంబంధించి అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయంపై ఈ పర్యటనలోనే కిరణ్‌కు స్పష్టత ఏర్పడుతుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణ సహా పలు అంశాలపై ఆయన అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


'వ్యూహాత్మక సభ'...
అధిష్ఠానం నుంచి 'సానుకూల' సంకేతాలు ఉన్నందునే టీ-కాంగ్రెస్ నేతలు బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు కూడా చెబుతున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో ఢిల్లీ పెద్దలను కలసిన డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు అంతర్లీనంగా అధిష్ఠానం నిర్ణయం తెలిసిందని అంటున్నారు. అందువల్లే నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 30న భారీ మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించేందుకు సిద్ధవుతున్నారు.

No comments