1

Breaking News

చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం ఈ పైరసీ!

‘‘మా సినిమాని పైరసీ సీడీలో చూడకండి. దయచేసి థియేటర్‌కి వచ్చి చూడండి. కోట్ల రూపాయల సినిమాని కుటుంబ సమేతంగా థియేటర్‌లో చూసి మా నిర్మాతని రక్షించండి. మరెన్నో కొత్త సినిమాల్ని, వైవిధ్యం ఉన్న సినిమాల్ని అందిస్తాం. పైరసీకారులూ..! పరిశ్రమపై ఆధారపడిన లక్షల కుటుంబాల పొట్ట కొట్టకండి. దోపిడీ చేయకండి. పైరసీ నేరం’’ ఇటీవలి కాలంలో ఏ సినిమా వేదికను పరిశీలించినా...సదరు చిత్రయూనిట్‌ తరపున వినిపించే అభ్యర్థనలు ఇవి. అయితే అసలు పైరసీకి కారణం ఏమిటి? అందుకు టిక్కెట్‌ రేటు ఓ కారణమా? సిండిేట్‌ ధౌర్జన్యం ఎంతవరకూ పనిచేస్తోంది? టిక్కెట్‌ బ్లాక్‌మార్కెట్‌ ప్రభావం ఎంత? రేటు పెంపుకు తగ్గట్టే థియేటర్లలో వసతులు ఉన్నాయా?..ఇలా పలుకోణాల్లో పరిశీలిస్తే చాలా సంగుతులే తెలిసొస్తాయి. అవేంటో చూద్దాం....
ఏళ్ల తరబడి ఎంతో కష్టించి...కోట్లాది రూపాయల ఖర్చుతో.. నిర్మాత సినిమాలు తీస్తుంటే.. ఆ కష్టాన్ని కేవలం పది రూపాయల పైరసీ సీడీలో చూసేయడం ఎంతవరకూ సబబు? పైరసీదారులు సినిమాని తేలిగ్గా కాపీ చేసి యథేచ్ఛగా సీడీల రూపంలో అమ్మకాలు సాగించడం న్యాయమా? చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం ఈ పైరసీ! దీన్ని అందరూ ఖండించాల్సిందే! ఎట్టిపరిస్థితుల్లో పైరసీని ఆపాల్సిందే! అయితే ఒకే ఒక్క క్షణం తెరవెనుక సంగతులు ఆరాతీసి..నాణానికి రెండో కోణం పరిశీలిస్తే..అంతకు మించిన ఆసక్తికరమైన సంగతులెన్నో బైటికొస్తాయి. పైరసీ ఎలా పెరుగుతోంది? ప్రేక్షకులు హాలుకు వెళ్ళడం మానేసి, పైరసీ సీడీలనే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఊరూరా..పల్లె పల్లెనా.. క్యాన్సర్‌లా పాకిపోతున్న పైరసీకి అసలు కారణం ఏమిటి? అంటే ఒకే ఒక్కసమాధా నం.. టికెట్‌ ధర. కుటుంబ సమేతంగా కేటాయించాల్సిన బడా బడ్జెట్‌ వికృతరూపం... ఫ్యామిలీ బడ్జెట్‌లో అగ్రభాగం వినోదానికి కేటాయించలేని సామాన్యుని ధైన్యం... ఆదాయ వ్యయాల పట్టికలో చిట్టచివరి ఆప్షన్‌గా సినిమాని చూసే దౌర్భాగ్యం...

మల్టీప్లెక్సులో సినిమా సరికదా..! ఓ సాదాసీదా థియేటర్‌లో బాల్కనీ అంటేనే బెంబేలెత్తే ధీనస్థితిలో ప్రజానీకం ఉండడమూ ఓ కారణమే. మొన్నటికి మొన్న సంక్రాంతి సీజన్‌ పేరుతో బడా హీరోల సినిమాల విషయంలో థియేటర్‌ వద్ద జరిగిన నిర్వాకంలో ముచ్చెమటలు పట్టించే నిజాలెన్నో వెలికొచ్చాయి. వారం పాటు బ్లాక్‌మార్కెట్‌ బార్లా తెరుచుకుని రాజ్యమేలిన సంగతి అందరికీ తెలిసిందే. అభిమాన హీరో సినిమాని తొలిరోజు చూసేయాలన్న అభిమాని నుంచి సామాన్య జనం వరకూ రూ.500-1000 వెచ్చించి తప్పక బ్లాక్‌టిక్కెట్‌ కొనాల్సిన స్థితి. ఇది ఎవరుకల్పించా రు..అందరికీ తెలిసిన తంతే ఇది. ఈ వ్యవహారం ఎప్పుడూ ఉన్నదే అని తేలిగ్గా కొట్టిపారేయలేం. ఆంధ్రప్రదేశ్‌ లోని పెద్ద నగరాలను సహా చోటా మోటా సిటీలు..ఊళ్లో టూరింగుథియేటర్లు..ఎక్కడైనా అగ్ర హీరోల సినిమాకు విడుదలైన తొలి రోజుల్లో వెళ్ళి చూడగలమా? సినిమా హాళ్ళలో పబ్లిక్‌గా ప్రేక్షక జనానికి జరుగుతున్న నిలువు దోపిడీ కళ్ళెదురుగా కనబడుతుంది.

సినిమాకున్న క్రేజును బట్టి హాలు కౌంటర్‌లోనే అధికారికంగా టికెట్లను భారీ రేట్లకు అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హీరోల తెలుగు చిత్రాలు సగటున 1250 నుంచి 1300 కేంద్రాల్లో విడుదలవుతున్నాయి. సినీ వ్యాపార పరిభాషలో ఈ కేంద్రాలను ఏ ప్లస్‌ (హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటివి), ఏ (తెనాలి, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటివి), మేజర్‌ బి, మైనర్‌ బి, మేజర్‌ సి, మైనర్‌ సి అనే ఆరు వర్గాలుగా వర్గీకరిస్తుంటారు. ఇందులో ప్రభుత్వ అధికారుల నిఘా ఎంతో కొంత ఉండే ఏ ప్లస్‌ కేంద్రాల్లో తప్ప, మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఇష్టారాజ్యంగా సాగుతోంది. రాష్ట్రంలో మహా అయితే ఓ 10 కేంద్రాలు మినహా, మిగిలిన అన్ని చోట్లా ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఒకప్పుడు హాలు బయట ఎవరో,అదీ కొన్ని టికెట్లే బ్లాకులో అమ్మేవారు. అమ్మిం చేవారు. కానీ, ఇవాళ బాహాటంగా బుకింగ్‌లోనే అన్ని టికెట్లూ బ్లాకు లో అమ్మేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ తెలుగు సినిమా అయినా చూడండి.

ఆరంభంలోని ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల పుణ్యమా అని ప్రతి అగ్రహీరో తెలుగు సినిమా తొలి వారంలోనే కోట్ల కొద్దీ ఆర్జిస్తోంది. చిత్రం ఏమిటంటే బాగా లేదని టాక్‌ వచ్చిన సినిమాకు కూడా తొలినాళ్ళ కలెక్షన్లు దిమ్మ తిరిగేలా ఉంటున్నాయి. దీనికి కారణం అడ్డగోలు టికెట్‌ విధానమే. నిజానికి ప్రభుత్వపరంగా ఈ విధానానికి అనుమతి లేదు. గతంలో జై చిరంజీవ (2005 డిసెంబర్‌) చిత్రం విడుదల సమయంలో మన సినిమా పెద్దలే తమ పలుకుబడితో అప్పటి వైఎస్సార్‌ప్రభుత్వంతో ఓ ఉత్తర్వు ఇప్పించు కున్నారు. విడుదలైన కొత్త సినిమాకు రెండు వారాల పాటు హాలులోని పై రెండు తరగతుల టికెట్‌ రేట్లనూ పెంచుకొనేందుకు అనుమతి పొందారు. అలా టికెట్‌ రేట్లుఒక్కసారిగా అందని ఎత్తుకు వెళ్ళాయి. దాదాపు 40 రూపాయల బాల్కనీ టికెట్‌ కాస్తా రూ. 100కి పాకింది. టికెట్లను అధికారికంగానే ఎక్కువ రేట్లకు అమ్మే ఏర్పాటును తెలివిగా చేసుకున్నారు. అది అలా ఉంచితే, మొత్తానికి ఈ పద్ధతి వల్ల తొలివారాల్లో పెద్ద సినిమాలకు వసూ ళ్ళు పెరిగినా, పోను పోనూ పైరసీకి ఇది యథోచి తంగా తోడ్పడింది. దానికి చిత్రపరిశ్రమలోని వర్గ రాజకీయాలు అగ్నికి ఆజ్యంలా వచ్చి చేరాయి.

మళ్ళీ అదే సినీ పెద్దలు ఆ రెండు వారాల టికెట్‌ రేట్ల పెంపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో రద్దు చేయించారు. అటు పిమ్మట రోశయ్య నేతృత్వంలోని ప్రభుత్వం.. రెండు వారాలే కాదు..శాశ్వతంగా టికెట్‌ రేట్లు పెంచుకొనే వెసులుబాటు ఇచ్చేసింది. కాదు పెద్దలే అనుమతులు తెచ్చుకున్నారు. దీంతో అప్పుడు పెద్ద ఊళ్ళలో బాల్కనీ టికెట్‌ రేటు రూ. 40 నుంచి రూ. 50 అయింది. మల్టీప్లెక్సుల్లో రూ. 100 నుంచి రూ. 150కి ధర పాకింది. ఈ అనుమతులన్నీ పరిశ్రమ కోసం, ప్రజల కోసం కానే కావు. భారీ రేటుకు తాము ఏరియాల వారీగా కొన్న సినిమాల మీద డబ్బులు వెనక్కి రాబట్టుకునే కనికట్టు విద్యలో భాగంగానే ఇదంతా. ఇవన్నీ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి సంకుచిత, స్వార్థ ప్రయోజనాలతో చేసిన పనులే అని చిత్రపరిశ్రమ అంతర్గత వర్గాలు సైతం లోగుట్టు బైటపెట్టాయి. ఈ సంకులంలో చిక్కుకునే నేటికీ కోలుకోలేక చిన్నసినిమా అధోగతి పాలైంది.
ముందుంది మొసళ్ల పండుగ!టిక్కెట్లు రేట్లు పెంపకానికి..మళ్లీ బలమైన ప్రపోజల్స్‌ తెరపైకి వచ్చాయి. ఇప్పటికే పెనుభారంగా మారిన టికెట్‌ రేట్లు విడుదలకు సిద్ధమవుతున్న చిన్న సినిమాలపై తీవ్రప్రభావాన్ని చూపడం ఖాయం.

ఏతావాతా పెరిగిన రేటుకు అనుగుణంగా సౌకర్యాలు పెరిగాయా? అంటే శూన్యం. టాయ్‌లెట్‌ నుంచి బాల్కనీ ప్రవేశ ద్వారం వరకూ కంపుకొట్టే థియేటర్లు ఏపీలో లెక్కకు మిక్కిలి. వీటన్నిటా అధికారుల చర్యలు మాత్రం శూన్యం. సౌకర్యాలు సుఖంగా ఉంటే రేటు కొద్దిగా పెంచినా వినియోగదారుడు పెద్దగా పట్టించు కోడు. ఏడుస్తూ థియేటర్‌ నుంచి రాడు. ‘సామాన్యు ని అతీగతీ పట్టించుకోవాలి. ధరకు తగ్గ సౌకర్యమూ ఇవ్వాలి’. ఈ విషయాన్ని సినీ పెద్దలు పరిశీలించాలి. పునరాలోచించి టికెట్‌పై నిర్ణయం తీసుకోవాలి.

No comments