1

Breaking News

సోనియా గాంధీ చురకలు అంటించారు

కట్టుతప్పి కప్పగంతులు వేస్తున్న తమ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చురకలు అంటించారు. హద్దుమీరి ఆడంబరాలకు పోవ ద్దని హితవు పలికారు. నిరాడంబరంగా ఉండాలని సూచించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ మేథో మధన సదస్సులో స్వాగతోపన్యాసం చేసిన సోనియమ్మ పలు విషయాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడదన్నారు. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

సోనియా స్వాగతోపన్యాసంలో ప్రధానంగా ఆకట్టుకున్న అంశం నిరాడంబరత. పార్టీ నేతలు నిరాండరంగా ఉండాలని అధిష్టానమ్మ వినమ్రంగా కోరారు. ఆడంబరంగా వివాహ వేడుకలు చేస్తే డబ్బు ఎక్కడినుంచి వచ్చిందన్న ప్రశ్న రాదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుమార్తె వివాహం వైభవోపేతంగా జరిగిన సంగతి ఇక్కడ ప్రస్తావనర్హం. కూతురి పెళ్లికోసం బొత్స కుటుంబం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలూ వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ వివాహ వేడుకలు భారీ స్థాయిలోనే జరిగాయి. 
రాజకీయ నేతల కుటుంబాల్లో ఆర్భాటపు పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి.తమ డాబు, దర్పం ప్రదర్శించేందుకు పెళ్లి తంతును పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేతలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు. ఇక అధికార పార్టీ నాయకులైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని సొంతిట్లో వేడుకలకు విచక్షణారహితంగా వాడుకున్న దాఖలాలు కోకొల్లలు. దారికి రాని అధికారులను బెదిరించి పనులు చేయించుకోవడం పాలక గణానికి పెద్ద పనేం కాదు. అందునా దండోపాయంలో ఆరితేరిన నేతాగణ ం జడుపు కూడా దిగులు పుట్టించగలరు. అమాత్యులు తలుచుకోవాలేగాని తలవంచని వాడెవడు?

పెళ్లనేది నూరెళ్ల పంట. తమకున్నంతలో ప్రతిఒక్కరూ ఆ అపురూప వేడుకను ఘనంగా చేసుకోవాలనుకుంటారు. చేసుకుంటారు కూడా. అయితే రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, శ్రీమంతులు వివాహ వేడుకలను ప్రచార్భాటంగా జరుపుకోవడం ఈమధ్య కాలంలో అధికమయింది. ఆడంబర పెళ్లిళ్లను కవర్ చేసేందుకు వార్తా చానళ్లు కూడా ఎగబడుతుండడంతో ఈ పిచ్చి బాగా ముదిరింది. చానళ్ల మోత తట్టుకోలేక చాలా మంది సెలబ్రిటీలు గుట్టుగా వివాహ తంతు కానిచ్చేస్తున్నారు. దీనికి రాజకీయ నాయకులు పూర్తిగా మినహాయింపు. 

తమ హోదాకు తగ్గట్టుగా పెళ్లిళ్లు చేయకపోతే నేతలకు నిద్దర పట్టదు. ఇందుకోసం ఎంత ఖర్చుచేసేందుకైనా వెనుకాడరు. అధికార దుర్వినియోగానికి సంకోచించరు. అందుకో కాబోలు సోనియమ్మ సూటిగా ‘సింప్లిసిటీ’ సూత్రం ఉపదేశించారు. ఆడంబరాలకు పోతే అసలుకే మోసం వస్తుందని హితవచనాలు వల్లించారు. దుబారా చేస్తే ‘గుట్టు’ రట్టవుతుందని హెచ్చరించారు. అధిష్టానమ్మ ఆదేశంతోనైనా హస్తం పార్టీ నేతలు హంగామా మానుకుంటారా, లేదా అనేది కాలమే చెప్పాలి. అన్ని పార్టీల నేతలకు సోనియా ‘సింప్లిసిటీ’ సలహా వర్తిస్తుందనడంలో వింతేముంది!

No comments